- హోమ్›
- వార్తలు›
- రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విగ్రహ ధ్వంసం కేసు మిస్టరీని ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విగ్రహ ధ్వంసం కేసు మిస్టరీని ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు
By: chandrasekar Tue, 29 Sept 2020 09:24 AM
అనతి కాలంగా దేవాలయాలకు
సంబంధించిన చాలా కేసులు రాష్ట్రంలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా
సంచలనం రేపిన విగ్రహ ధ్వంసం కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. కర్నూలు
జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాలభైరవ స్వామి విగ్రహ ధ్వంసం కేసు
మిస్టరీని పోలీసులు చేధించారు. కాలభైరవ దిగంబర విగ్రహానికి ఇంట్లోనే పూజలు చేస్తే
పిల్లలు పుడతారనే నమ్మకంతో ఓ వ్యక్తి ప్రతిమను ధ్వంసం చేసినట్లు పోలీసుల విచారణలో
వెల్లడైంది. తన మూఢనమ్మకం వల్ల రాష్ట్రంలో అలజడి రేపాడు. కర్నూలు జిల్లా పాలకొండ
మండలం చిన్నకందూరులో ఈ నెల 19 వ తేదీన గుర్తుతెలియని దుండగులు కాలభైరవ స్వామి
విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. విగ్రహాన్ని
ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సీరియస్గా
తీసుకున్న జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రత్యేక బృందంతో లోతుగా విచారణ జరిపించారు.ఇందులో
భాగంగా గోస్పాడు మండలం వంట వెలగల గ్రామానికి చెందిన సత్తెనపల్లి రాజశేఖర్ను
అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అసలు విషయాలు బయట పడడంతో
పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాజశేఖర్కు పదేళ్ల క్రితం వివాహమైనా ఇప్పటి
వరకు సంతానం కలగలేదు. పిల్లల కోసం ప్రతి అమావాస్య రోజున కాలభైవర స్వామికి ప్రత్యేక
పూజలు చేసేవారు. అయితే ఆలయంలో కాకుండా ఇంట్లో పూజలు చేస్తే పిల్లలు పుడతారని ఎవరో
చెప్పడంతో అర్ధరాత్రి సమయంలో దేవాలయానికి వెళ్లి తాళాలు పగలగొట్టి గుడిలోని
కాలభైరవ స్వామి విగ్రహాన్ని పగులగొట్టి ఇంటికి తీసుకెళ్లి గుట్టుగా పూజలు
చేసేవాడు. దీంతో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. రాజశేఖర్ ఇంట్లో పూజలు
చేస్తున్న విషయాన్ని కొందరు స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు నిందితుడిని
అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా ఎస్పీ ఫకీరప్ప
మాట్లాడుతూ కాలభైరవ విగ్రహాన్ని ఎవ్వరూ కావాలని పగులగొట్టలేదని వెల్లడించారు.
ఇందులో రాజకీయ ప్రమేయం లేదని కేవలం మూఢనమ్మకాల ఫలితంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారని
చెప్పారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.