వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయిన ఘటనలో గర్భిణీ మృతి ...
By: Sankar Mon, 27 July 2020 6:08 PM
కలుగొట్ల వాగులో రెండు రోజులుగా వెతుకుతున్న గర్భిణి నాగసింధూరెడ్డి(28) విగతజీవిగా తేలింది. సోమవారం తెల్లవారుజామున తుంగభద్ర నదిలో కర్నూలు బ్రిడ్జి దగ్గర గర్భిణీ మృతదేహం లభ్యమైంది. నాగసింధూరెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు హృదయ విదాకరంగా విలపించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భార్యభర్తలు నాగసింధూరెడ్డి, శివశంకర్రెడ్డితోపాటు వారి స్నేహితుడు జిలానీబాషా కలిసి శనివారం బెంగళూరు నుంచి హైదరాబాద్కు కారులో బయల్దేరారు. కలుగొట్ల వాగులో వీరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. మిగతా ఇద్దరు బయటపడగా.. సదరు మహిళ గల్లంతైంది. గల్లంతైన ప్రాంతం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి గర్భిణి శవమై విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..
కాగా నిన్న చెక్పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమో అనే భయంతో పాటు ఆలస్యమవుతుందని భావించి డ్రైవింగ్ చేస్తున్న జిలానీబాషా జాతీయ రహదారి నుంచి కారును గ్రామాల మీదుగా మళ్లించాడు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి కలుగొట్ల మీదుగా కారుని పోనిచ్చారు . జోరువాన.. పైగా చీకట్లో కలుగొట్ల వాగు ఉధృతిని అంచనా వేయలేక వేగంగా వాగు దాటించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతికి కారు అదుపుతప్పి కొట్టుకుపోయింది. నిద్రలో ఉన్న సింధూరెడ్డి వాగులో పడి నీటిలో మునిగిపోగా.. శివశంకర్రెడ్డి, జిలానీబాషా డోర్ తెరుచుకొని ముళ్లకంప సాయంతో ఎలాగోలా బయటపడ్డారు. సింధూను పట్టుకునే ప్రయత్నం చేసినా.. చీకటి, మరోవైపు నీటి ఉధృతి అధికంగా ఉండటంతో ఆమె గల్లంతైంది.