కరోనా నుంచి కోలుకున్న పోలీసులకు ఘన స్వాగతం పలికిన కమీషనర్ మహేష్ భగవత్
By: Sankar Tue, 07 July 2020 12:42 PM
ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు ఆసుపత్రులలో వైద్యులు , మెడికల్ సిబ్బంది అహర్నిశలు కష్టపడుతుంటే , మరోవైపు ప్రజలను అనవసరంగా బయటకు రానీయకుండా , సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేస్తూ పోలీసులు అంతే కష్టపడుతున్నారు ..దీంతో కరోనా పోరాటంలో పోలీసులు , వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు ..అయితే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పలువురు పోలీసులు కరోనా బారిన పడ్డారు. చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరు పోలీసు ఉన్నతాధికారులు తిరిగి విధుల్లో చేరారు. వీరికి రాచకొండ పోలీసు కమిషనర్ స్వాగతం పలికారు. అంతేకాకుండా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి కరోనా నుంచి బయటపడిన వారందరినీ సత్కరించారు. కరోనా బారిన పడితే ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని చాటారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 53 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ పోలీసులు ఎలాంటి ఆత్మస్థైర్యం కోల్పోకుండా కరోనాని జయించారని అన్నారు. కరోనా సోకిందని తెలిసినా ఎవరూ భయపడవద్దని సూచించారు. సరైన ఆహారం జాగ్రతలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని అన్నారు. ఇందుకు తమ సిబ్బందే ఉదాహరణ అని గుర్తు చేశారు.
ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మాస్క్ లేకపోతే ఫైన్లు విధిస్తున్నాం. ఎవరైనా గుమిగూడి కార్యక్రమాలు చేస్తున్నా, వేడుకలు చేస్తున్న ప్రజలు సమాచారం ఇవ్వండి.’’ అని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు.