Advertisement

ఉద్యోగాల పేరు చెప్పి లక్షల్లో మోసం ..

By: Sankar Sun, 28 June 2020 2:58 PM

ఉద్యోగాల పేరు చెప్పి లక్షల్లో మోసం ..



ఇండియాలో యువతకు ఉన్న ప్రధాన సమస్య నిరుద్యోగం ..ఎంత కస్టపడి చదివినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో యువకులు నిరాశకు లోనవుతున్నారు ..అలాంటి వారే లక్ష్యంగా ఒక ఘరానా మోసగాడు హైద్రాబాద్లో 26 లక్షలు కాజేసాడు ..నిజామాబాద్‌ జిల్లాకు చెందిన దోమకొండ వెంకటేష్‌ అనే వ్యక్తి నగరానికి వలసవచ్చి చిక్కడపల్లిలో స్థిరపడ్డాడు. డిగ్రీ విద్యను మధ్యలోనే ఆపేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా అవతారమెత్తాడు. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యాపారులతో అతడికి పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం సాగకపోవడంతో ఉద్యోగాల పేరుతో మోసాలు చేయాలని పథకం రచించాడు. తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకునేవాడు. వీటి ఆధారంగా వివిధ కేంద్ర, రాష్ట్ర విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికేవాడు.

ఈ క్రమంలోనే చిక్కడపల్లి వాసి రాజిరెడ్డి తన కుమారుడితో పాటు పరియస్తులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయం ఆయన ద్వారానే తెలుసుకున్న వెంకటేష్‌.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. రాజిరెడ్డి కుమారుడికి రెవెన్యూ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్, మిగిలిన వారికి నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌లో (ఎన్‌ఐసీ) టెక్నికల్‌ అసిస్టెంట్, నాబార్డ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు ఇప్పిస్తానని ఎర వేశాడు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున ఖర్చవుతుందంటూ రాజిరెడ్డి నుంచి వివిధ దఫాల్లో రూ.26.5 లక్షలు కాజేశాడు. ఆయనకు నమ్మకం కలగడానికి బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఫొటోలు, చిరునామా ధ్రువీకరణలు కూడా తీసుకున్నాడు.

బాధితుడు ఎప్పుడు ప్రశ్నించినా ఆయా విభాగాల్లో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయని, చేరాల్సిన పంథాలోనే వచ్చి చేరతాయని చెప్పేవాడు. ఎంతకీ నిమాయకాలు జరగకపోవడంతో రాజిరెడ్డి తన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ వెంకటేష్‌పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్న వెంకటేష్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బాధితుడు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో రంగంలోకి దిగిన బృందం శనివారం నిందితుడిని పట్టుకుంది.



Tags :
|
|
|
|

Advertisement