- హోమ్›
- వార్తలు›
- పోలవరం ప్రాజెక్ట్ పెంచడం వలన తెలంగాణకు ముప్పు ఉంది... లేఖ రాసిన రాష్ట్ర ఈఎన్సీ సీ మురళీధర్
పోలవరం ప్రాజెక్ట్ పెంచడం వలన తెలంగాణకు ముప్పు ఉంది... లేఖ రాసిన రాష్ట్ర ఈఎన్సీ సీ మురళీధర్
By: Sankar Mon, 02 Nov 2020 11:18 AM
ఏపీ ప్రభుత్వం నిర్మించే పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, మణుగూరు భారజల విద్యుత్ కేంద్రానికీ ప్రమాదం పొంచి ఉన్నదని రాష్ట్ర ఈఎన్సీ సీ మురళీధర్ ఆందోళన వ్యక్తంచేశారు. బ్యాక్వాటర్తో కలిగే ముంపు విస్తీర్ణంపై మరోసారి సర్వేచేసి, నివారణకు రక్షణ చర్యలు చేపట్టాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరారు.
జాతీయ హోదా పొందిన పోలవరం ప్రాజెక్టును ముందుగా అనుకున్న 36 లక్షలకు మించి 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మిస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రభావం, తెలంగాణకు కలుగుతున్న నష్టాలను, ఆందోళనలను వివరిస్తూ అథారిటీ సీఈవోకు ఆయన లేఖ రాశారు. ప్రాజెక్టుకు 1980లో అనుమతులు తీసుకున్నప్పుడు గరిష్ఠ వరద ప్రవాహం(పీఎంఎఫ్) 36 లక్షల క్యూసెక్కులుగా అంచనా వేశారని, ప్రాజెక్టు ఎత్తును 140 మీటర్లకు పరిమితం చేశారని గుర్తుచేశారు.
2009లో కేంద్ర జలసంఘం 50 లక్షల క్యూసెక్కుల పీఎంఎఫ్తో నిర్మాణానికి అనుమతినిచ్చిందన్నారు. ఈ మేరకు డిజైన్, నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. పీఎంఎఫ్ పెరుగడంతో బ్యాక్వాటర్ వల్ల ముంపు విస్తీర్ణం పెరుగుతున్నదన్నారు. గతంలో 32 లక్షల క్యూసెక్కుల పీఎంఎఫ్కు మాత్రమే అధ్యయనం చేశారని, ఈ పరిధిలోకి వచ్చే 371 గ్రామాలను రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కలుపుకొన్నారని గుర్తుచేశారు. 50 లక్షల క్యూసెక్కుల వల్ల కలిగే నష్టంపై తాము హైదరాబాద్ ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేయించామన్నారు.