కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మోడీ వీడియో కాన్ఫరెన్స్ పై ఆసక్తి
By: Sankar Mon, 15 June 2020 8:49 PM
ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16, 17 తేదీల్లో సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ గురించి ఆయన చర్చించనున్నారు. మంగళవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంభాషించనున్నారు. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో ఈ 21 రాష్ట్రాల్లో దాదాపు 5 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధిక కోవిడ్ కేసులు నమోదైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.
కరోనా వైరస్ కేసుల పెరుగుదల, రాష్ట్రాల భౌగోళిక స్థానాల ఆధారంగా రాష్ట్రాలను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ జాబితాను ప్రధానమంత్రి కార్యాలయం గతవారం ట్విటర్లో షేర్ చేసింది. మొదటి రోజు వీడియో కాన్ఫరెన్స్లో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వతప్రాంత రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు.
ఈ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు అసోం(4049), పంజాబ్(3140), కేరళ(2461)లలో నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదివారం నాటికి ఈ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన మొత్తం క్రియాశీల కేసులు18,000 లోపు ఉన్నాయి. 7,500 మంది కోలుకోగా, 130కి పైగా మరణాలు సంభవించాయి. సోమవారం నాటికి దేశంలోని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424కి చేరగా, మృతుల సంఖ్య 9,520కి పెరిగింది.