బీహార్ లో అభివృద్ధి 2014 తర్వాత దూసుకుపోతుంది ..ప్రధాని నరేంద్ర మోడీ
By: Sankar Fri, 23 Oct 2020 12:46 PM
ప్రధాని నరేంద్రమోదీ ఎన్డీయే కూటమి తరపున బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం నాడు సాసరమ్లో జరిగిన తొలి ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న సమయంలో నితీష్ కుమార్ ప్రభుత్వం శరవేగంగా స్పందించి ప్రజలకు అండగా నిలిచింది. ఆ సమయంలో నిర్లక్ష్యం వహించే ఉంటే అనూహ్యమైన కల్లోలం జరిగుండేది. అయితే నేడు బీహార్ ప్రజలు కోవిడ్పై పోరాడి, ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నారు.
2014 తర్వాత బిహార్లో అభివృద్ధి డబుల్ రైల్ ఇంజన్లా పరిగెడుతోంది. కరోనా కాలంలో పేదల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేశాం. ఈ మధ్య కాలంలో మరణించిన బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్విలాస్ పాశ్వాన్, రఘువంశ్ ప్రసాద్ సింగ్కు నివాళులర్పించారు.
గాల్వన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు పాదాభివందనం' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి మొత్తం 12 సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
కాగా బిహార్లో ప్రజలకు ఉచితంగా కోవిడ్–19 వ్యాక్సిన్ను అందిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఐసీఎంఆర్ ఆమోదం లభించగానే కోవిడ్–19 వ్యాక్సిన్ను ఒకసారి ఉచితంగా అందిస్తామన్నారు..
అయితే కరోనా మహమ్మారిని అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ అంశంలో ఎన్నికల సంఘం పార్టీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవడానికి తమ రాష్ట్రానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూడాలా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు.