కరోనా పరిస్థితిపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో ఫోన్లో సంబాషించిన పీఎం నరేంద్ర మోడీ ..
By: Sankar Sun, 19 July 2020 7:40 PM
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా పరిస్థితులపై ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదివారం ఫోన్ చేసి కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు మోదీ ఫోన్ చేశారు. కరోనా తీవ్రత, కట్టడిని చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే వైరస్ను నివారించుటకు పలు సూచనలు, సలహాలు సైతం చేశారు.
మరోవైపు వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న బిహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ముచ్చటించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా పరీక్షలను రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు మోదీ అభినందనలు తెలిపారు. కాగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్ మంత్రాన్ని పాటిస్తున్నాయి.
కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చాయి ..ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్లో గత వారం రోజులుగా కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చాయి ..టెస్టులు పెరిగే కొలది పాజిటివ్ కేసులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి ..