మోడీకి తిరుగులేదు అని తేల్చి చెప్పిన ప్రజలు
By: Sankar Mon, 10 Aug 2020 10:17 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేని ప్రజాదరణ ఉందని మరోసారి తేలింది. ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని ‘ఇండియా టుడే – కార్వీ ఇన్సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తాజాగా తేల్చింది. ప్రధానిగా మోదీ పనితీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో 30% మంది, బావుందని 48%, సాధారణంగా ఉందని 17% అభిప్రాయపడ్డారు. 5% మాత్రం మోదీ పనితీరు బాగాలేదన్నారు.
ఒకవైపు, దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా, మరోవైపు, దేశ ఆర్థిక రంగ కుంగుబాటు, ఇంకోవైపు చైనాతో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న క్లిష్ట సమయంలో జరిగిన ఈ సర్వేలో.. దేశ ప్రజలు మోదీపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. ఫిబ్రవరి 2016 – ఆగస్టు 2020 మధ్య నిర్వహించిన 10 సర్వేలను పోలిస్తే.. మోదీకి ప్రజాదరణ గణనీయంగా పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది..
ప్రతిపక్షంగా కాంగ్రెస్ పనితీరు చాలా బావుందని కేవలం 9% మంది అభిప్రాయపడగా, బావుందని 35%, సాధారణమని 32%, బాగాలేదని 21% మంది తెలిపారు. కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకురాగలిగే నేత రాహుల్ గాంధీయేనని 23% మంది పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రియాంకాగాంధీకి 14%, మన్మోహన్ సింగ్కు 18%, సోనియా గాంధీకి 14% మంది ఓటేశారు.