కరోనా వ్యాక్సిన్ పనుల పురోగతిపై రేపు మూడు నగరాలలో పర్యటించనున్న మోడీ
By: Sankar Fri, 27 Nov 2020 7:00 PM
దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. వ్యాక్సిన్ తయారీపై సమీక్షించడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ప్రధాని మోదీ శనివారం మూడు నగరాల్లో పర్యటించనున్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి చేస్తున్న సంస్థలను ఆయన పరిశీలించనున్నారు. కొవిడ్ టీకా పురోగతి పనులను సమీక్షించేందుకు అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె నగరాల్లో ప్రధాని పర్యటిస్తారు. అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ, పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని మోదీ సందర్శించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్లో తెలిపింది.
కొవిడ్పై పోరాటంలో భారత్ కీలక దశకు చేరుకున్నదని, టీకా ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలను పరిశీలించడం, అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో సంప్రదించడం వల్ల .. టీకా గురించి సమగ్ర సమచారం తెలుస్తుందని పీఎంవో తన ట్వీట్లో పేర్కొంది. దేశ పౌరులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎదురయ్యే సవాళ్లను, కార్యాచరణను తయారు చేసేందుకు ఈ పర్యటన వీలవుతుందని పీఎంవో తన ప్రకటనలో వెల్లడించింది.