దిగ్గజ మాజీ ప్రధానిని స్మరించుకుంటూ ట్వీట్ చేసిన ప్రధాని మోడీ
By: Sankar Sun, 16 Aug 2020 11:02 AM
దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి రెండో వర్ధంతి(ఆగస్టు 16) సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ‘ఈ పుణ్యతిథిన అటల్జీకి ఇవే నా ఘనమైన నివాళులు. ఆ మహనీయుడి సేవల్ని భారత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’ అని ఓ ట్వీట్ చేస్తూ వాజ్ పేయికి సంబంధించిన ఫొటోలతో కూడిన సుమారు రెండు నిముషాల వీడియోను మోదీ విడుదల చేశారు.
ప్రధానిగా దేశాభివృద్ధికి అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు ఎనలేనివని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన హయాంలోనే భారత్ అణు శక్తిగా ఎదిగిందని గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా, ఎంపీగా, ప్రధానిగా అటల్ ఈ దేశానికి అమూల్యమైన సేవలను అందించారని అన్నారు.
1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో వాజ్పేయి జన్మించారు. బీజేపీ నుంచి ప్రధాని అయిన మొదటి నాయకుడు ఆయనే. మూడు పర్యాయాలు ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు. 1996లో, 1998 నుంచి 1999వరకు ఆ తరువాత 1999 -2004 మధ్య పూర్తి ఐదేళ్లు ప్రధానిగా వాజ్పేయి కొనసాగారు. ఆయన హయాంలోనే 1998 మే 11 -13 మధ్య భారత్ పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించింది. 2018 ఆగస్టు 16 న వాజ్ పేయి దివంగతులయ్యారు.