దేశం పెద్ద రాజనీతజ్ఞుడిని కోల్పోయింది..ప్రణబ్ మృతిపై రాజకీయ ప్రముఖుల దిగ్బ్రాంతి
By: Sankar Mon, 31 Aug 2020 6:53 PM
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ మరణంపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు..ఎన్నో ఏళ్ళ తన రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకుడిగా ప్రజలకు , దేశానికి ఎంతో సేవ చేసాడని కొనియాడారు..దేశం పెద్ద రాజనీతిజ్ఞడ్ని కోల్పోయిందంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు.
ప్రజా జీవితంలో మహోన్నత నేత అని, ఆయన భరత మాతకు ఓ రుషి మాదిరిగా సేవ చేశారని రాష్ట్రపతి కోవింద్ కొనియాడారు. అత్యంత విలువైన బిడ్డల్లో ఒకరిని కోల్పోయినందుకు దేశం శోకిస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రజలందరికీ సంతాపం తెలిపారు.
ఇక ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయం అని కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్ దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు..
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ మరణ వార్త పట్ల ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రణబ్ నిజమైన రాజనీతజ్ఞుడు అని ఆమె అన్నారు. దేశం కోసం ఆయన నిస్వార్థంగా సేవ చేశారన్నారు. ప్రణబ్తో దిగిన ఫోటోను తన ట్విట్టర్లో మాజీ ఎంపీ కవిత ఈ సందర్భంగా షేర్ చేశారు. ప్రణబ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి చెబుతున్నట్లు కవిత ట్వీట్ చేశారు.