ఐపీఎల్ 13వ సీజన్ను సెప్టెంబర్-అక్టోబర్ మధ్య నిర్వహించుటకు ప్రణాళికలు
By: chandrasekar Fri, 12 June 2020 11:01 AM
ఈ సంవత్సరం ఇండియన్
ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ను సెప్టెంబర్-అక్టోబర్ మధ్య నిర్వహించాలని
అనుకుంటున్నట్టు ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు. టీ20
ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ తుది నిర్ణయం ప్రకటించాక అందుకోసం ప్రణాళికలు
రచిస్తామని గురువారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
“ఐపీఎల్ నిర్వహించేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. అయితే టీ20
ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ తుది నిర్ణయం
ప్రకటించాకే ఐపీఎల్ కోసం ప్రణాళిక తాయారు చేస్తాం. విశ్వటోర్నీపై ఐసీసీ త్వరలోనే
నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. మేం మాత్రం సెప్టెంబర్-అక్టోబర్ విండోలో
ఐపీఎల్ నిర్వహించాలని అనుకుంటున్నాం” అని బ్రిజేశ్ అన్నాడు.
విదేశాల్లో టోర్నీ
నిర్వహించే అంశంపై ప్రస్తుతం ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్
నిర్వహించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
సైతం చెప్పాడు.
ప్రేక్షకులు లేకుండా
అయినా సరే టోర్నీ నిర్వహణకు సిద్ధమని, త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని బోర్డు
సభ్యులకు లేఖ రాశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ
సీజన్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.