ఆ రాష్ట్రంలో అక్టోబర్ 31 వరకు సినిమా హాల్స్ బంద్
By: Sankar Fri, 02 Oct 2020 3:54 PM
ఒడిశా రాష్ర్ట ప్రభుత్వం అన్లాక్ 5 మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ప్రార్థనా స్థలాలు, సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్లు, థియేటర్లు, ఆడిటోరియంలు, సమావేశ హాళ్ళు అక్టోబర్ 31 వరకు మూసి ఉంటాయని పేర్కొంది.
వీటితో పాటు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్యా, శిక్షణా సంస్థలు, అంగన్వాడీలు కూడా అక్టోబర్ 31 వరకు బంద్ పాటించనున్నట్లు తెలిపింది. స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్లు, జిల్లా స్థాయిలో ఎటువంటి లాక్డౌన్ విధించేందుకు వీలులేదంది.
కాగా నవంబర్ 3న బాలాసోర్, టిర్టోల్ అసెంబ్లీ విభాగాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ సమావేశాలు, ఇతర కార్యక్రమాలు, సమావేశాలను అనుమతిస్తూ ఈసీఐ, ఒడిశా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉత్తర్వులు వెలువరించారు. ఫేస్ మాస్క్లు ధరించడం, శారీరక దూరం పాటించడం, థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజింగ్ తప్పనిసరి.
100 మంది వ్యక్తుల పరిమితికి లోబడి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రాజకీయ సమావేశాలు అనుమతించబడతాయి. హాల్ సామార్థ్యాన్ని బట్టి అదేవిధంగా గ్రౌండ్ స్పేస్ను బట్టి సమావేశాలను అనుమతులు ఇవ్వనున్నారు. పెండ్లిండ్లకు 50 మంది మించకుండా అదే దహన సంస్కారాలకు 20 మందికి మించకుండా ఉండాలి. సరుకు రవాణా, ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు లేవు.