పైలట్ అప్రమత్తతో తప్పిన విమాన ప్రమాదం
By: chandrasekar Wed, 27 May 2020 6:15 PM
రెండు నెలల తరవాత
ప్రారంభమైన దేశీయ విమానాలు లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన వారందరిని
తిరిగి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జైపూర్ నుండి
హైదరాబాద్కు వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్
ఏషియా విమాన పైలట్ వెంటనే అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానంలో 76 మంది ప్రయాణికులకు భారీ ప్రమాదం తప్పింది.
పైలట్ ఏటీసీ ద్వారా
అధికారులను అప్రమత్తం చేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని
ప్రకటించారు. ఈక్రమంలో విమానాశ్రయంలో ఇతర సేవలన్నింటినీ నిలిపివేయడంతో పాటు
సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేందుకు అత్యవసర సేవలను అప్రమత్తం చేశారు. జైపూర్ నుండి
హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన ఎ-320
విమానానికి చెందిన ఒక ఇంజిన్లో ఫ్యూయల్ లీకేజీని పైలట్ ముందుగానే గుర్తించారు.
ముందు జాగ్రత్త చర్యగా ఆ ఇంజిన్ నిలిపివేసి అత్యవసర లాండింగ్ చేశారు.