కరోనా రోగుల విషయంలో వైద్యాధికారులు కీలక నిర్ణయం
By: chandrasekar Tue, 02 June 2020 4:41 PM
కరోనా వైరస్ పాజిటివ్గా
తేలిన కొంత మంది రోగులను ఇళ్లకు పంపించేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గాంధీలో కరోనా
చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 315 మందిని ఎంపిక చేశారు. వీరందరినీ తమ ఇళ్లకు పంపించేసి, అందరినీ
హోం క్వారంటైన్లో ఉంచాలని నిర్ణయించారు. కరోనా వైరస్ సోకి ఎలాంటి లక్షణాలు బయట పడకుండా
ఉన్నవారిని మాత్రమే హోం క్వారంటైన్కు తరలించాలని నిర్ణయించారు.
దీనికి సంబంధించిన సమాచారం
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్ని జిల్లాల వైద్య
ఆరోగ్యశాఖాధికారులకు ఇప్పటికే అందించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 500 మంది
వరకూ కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
గాంధీలో గరిష్ఠంగా 1,500 మందికి మించి చికిత్స అందించే మౌలిక వసతులు లేవు. ఈ
క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వైరస్ సోకినా
ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారిని ఇప్పటికే ఎంపిక చేశారు. ముఖ్యంగా 50 ఏళ్ల
వయసులోపు ఉన్న దాదాపు 315 మందిని గుర్తించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న
కరోనా రోగుల్లో కొందరిలో కనీసం జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కూడా కనిపించడం లేదు. అంటే, ఇలాంటి
వారిలో వైరస్ లోడ్ చాలా తక్కువ స్థాయిలో ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇలాంటి వారిని హోం
క్వారంటైన్లోనే ఉంచి సమయానికి మందులు అందించినా పెద్ద సమస్య ఏం ఉండబోదని అధికారులు
చెప్పారు. తాజా నిర్ణయం ఒకట్రెండు రోజుల్లో అమలు కానుందని తెలుస్తోంది. ఇళ్లకు
పంపేవారి ఎంపిక విషయంలో సిబ్బంది కొన్ని నిబంధనలు పాటించారు. వారికి హోం
క్వారంటైన్ విషయంలో కొన్ని షరతులు కూడా విధించారు. లక్షణాలు లేనంత మాత్రాన అందర్నీ
హోం క్వారంటైన్కు పంపరు. వారు 50 ఏళ్ల వయసు లోపు వారై అయి ఉండాలి.
ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు
ఉండకూడదు. తక్కువ వయసున్నాసరే జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఇంటికి పంపరు.
ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తారు. శిశువులు, గర్భిణులు, వృద్ధులు, కేన్సర్, కిడ్నీ సమస్యలు, షుగర్, హై బీపీ ఉన్న వారిని ఆసుపత్రిలోనే ఉంచాలి. పూర్తిగా
నయం అయ్యాకే డిశ్చార్జి చేస్తారు. ఇప్పటికే ఆయా కుటుంబాల్లో దీర్ఘకాలిక రోగాలతో
బాధపడే వారు, వృద్ధులు, గర్భిణులు, శిశువులుంటే మాత్రం హోం క్వారంటైన్కు కాకుండా
అధికారులు సూచించిన ప్రదేశాల్లో ఉండేందుకు అనుమతి యిచ్చారు.