కౌలు రైతులకు అన్యాయం జరిగితే సహించను - పవన్ కళ్యాణ్
By: Dimple Wed, 26 Aug 2020 11:57 PM
రెక్కాడితేగానీ డొక్కాడని కౌలు రైతుల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని జనసేనాని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తంచేశారు. కౌలు అడిగిన రాజధాని రైతులను అరెస్ట్ చేయడం గర్హనీయమన్నారు. అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదన్నారు. కౌలు చెల్లించమని అడిగేందుకు ఏఎంఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన 180 మంది రైతులను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించడాన్ని ఖండిస్తున్నట్లు పవన్ చెప్పారు. ఈ మేరకు జనసేన పార్టీ పవన్ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ ఏప్రిల్ నెలలో వార్షిక కౌలు చెల్లించాలని పవన్ చెప్పారు. ఒప్పందంలోని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా చెల్లించిందని గుర్తు చేశారు.
వరుసగా రెండో ఏడాది కూడా కౌలు చెల్లింపు జాప్యం చేస్తూ కౌలు సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసిందని ఆరోపించారు. రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని.. సకాలంలో కౌలు చెల్లించాలని పవన్ సూచించారు. జూన్ 21న కౌలు విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకీ కౌలు మొత్తం రాలేదన్నారు.
ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుందని చెప్పారు. తమ ప్రాంతంలో రాజధాని నిలుపుకోవడం కోసం 250 రోజులకి పైబడి రైతులు పోరాటం చేస్తున్నారని.. ఆ రైతులకు న్యాయం చేయాల్సిన తరుణంలో వార్షిక కౌలు కూడా చెల్లించకుండా జాప్యం చేయడం ఒప్పందం ఉల్లంఘనే అవుతుందన్నారు. తక్షణమే రైతులకు రావాల్సిన కౌలు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి చేశారు.
బిగ్ బాస్ నిర్వాహకులపై హోస్ట్ నాగార్జున సీరియస్
బిగ్ బాన్ నిర్వాహకులపై సినీ హీరో నాగార్జున సీరియస్ అయ్యారు. ఏ ముహూర్తాన బిగ్బాస్ నాల్గవ సీజన్ ఉంటుందని ప్రకటించారో గానీ అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఆగస్టు 30న బిగ్బాస్ ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ అన్ని పనులు పూర్తి కాకపోవడంతో అది కాస్తా సెప్టెంబర్ 5కి వాయిదా పడింది. మరోవైపు ఎంపిక చేసిన కంటెస్టెంట్లపై ప్రోమో చిత్రీకరించాల్సి ఉంది. కానీ ఆ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. నేడు జెమిని కామెడీ ఛానల్ యాంకర్ అరియానా గ్లోరీపై ప్రోమో చిత్రీకరించారు.
దీనికి ఉదయం నుంచి రాత్రి వరకు సమయం పట్టింది. దీంతో ఒక్క ప్రోమోను రోజంతా షూట్ చేస్తారా? అని సిబ్బంది పని తీరు పట్ల ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కింగ్ నాగార్జున చిరాకు పడినట్లు సమాచారం. పైగా ఈ రోజు ఆమె ఒక్కరిదే కాకుండా యూట్యూబర్ మెహబూబ్ దిల్ సేపై కూడా ప్రోమో చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఒక్క ప్రోమోకే ఒక రోజంతా పట్టడంతో అతని ప్రోమో తర్వాతి రోజుకు వాయిదా పడింది.
నత్తనడకన బిగ్బాస్ పనులు సాగుతుండటంతో సెప్టెంబర్ 5కు అయినా షో మొదలు పెడతామా? లేదా? అని నాగ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అనవసరమైన వాటి కోసం ఎక్కువగా సమయం వృథా చేయకుండా, త్వరగా మిగిలన పనులు పూర్తి చేయాలని బిగ్బాస్ టీమ్ను హెచ్చరించినట్లు కనిపిస్తోంది. ఇకనైనా వెనువెంటనే మిగతా కంటెస్టెంట్ల ప్రోమోల షూటింగ్లు పూర్తి చేసి కనీసం సెప్టెంబర్ 5కు అయినా ప్రారంభిస్తారో, లేదో చూడాలి! ఇదిలా వుంటే బిగ్బాస్ హౌస్లో శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అలాగే బిగ్బాస్ సిబ్బంది సంఖ్యలోనూ కోతలు విధించారు. కరోనా నేపథ్యంలో తక్కువ మంది సిబ్బందితోనే బిగ్బాస్ షో ముందుకు సాగనుంది.