Advertisement

  • విశాఖపట్నంలో 19,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వపై పవన్ ఆవేదన

విశాఖపట్నంలో 19,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వపై పవన్ ఆవేదన

By: chandrasekar Mon, 10 Aug 2020 2:30 PM

విశాఖపట్నంలో 19,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వపై పవన్ ఆవేదన


విశాఖపట్నంలో 19,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వపై పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. బీరుట్ ఓడ రేవులోని గోదాములో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ రసాయనిక చర్య కారణంగా పేలుడు సంభవించి 158 మంది అగ్నికి ఆహుతయ్యారని భవనాలు పేక మేడల్లా కూలిపోయాయని పవన్ గుర్తు చేశారు. అమ్మోనియం నైట్రేట్ బహుళ ప్రయోజనాలు గల రసాయనమని, జాగ్రత్తగా వాడుకుంటే ప్రగతి ఫలాలు అందిస్తుంది, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఊహించలేని విధ్వంసాన్ని సృష్టిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. ఎరువుల తయారీ, గనులలో పేలుళ్లు జరపడానికి ఈ రసాయనాన్ని విరివిగా ఉపయోగిస్తారని, ఇటీవల ఈ రసాయనం లెబనాన్ రాజధాని బీరుట్‌లో సృష్టించిన విధ్వంసం తలచుకుంటేనే భయాందోళనలు కలుగుతున్నాయని పవన్ తెలిపారు.

అమ్మోనియం నైట్రేట్ పేలుడు వల్ల బీరుట్ నగర జనాభాలో సగం మంది జీవితాలు కకావికలం అయిపోయాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్న దేశం కోలుకోవడానికి దశాబ్ధ కాలం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారన్నారు. ఈ ప్రమాదంలో 2,750 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు పేలాయన్నారు. అయితే మన పోర్టు నగరమైన విశాఖపట్నంలో ప్రస్తుతం సుమారు 19,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నాయని, అంటే సుమారుగా 8 రెట్లు ఎక్కువ అని పవన్ తెలిపారు. ఇవి పేలితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత దేశం మొత్తం అవసరాల కోసం అమ్మోనియా నైట్రేట్ విశాఖ ఓడరేవు ద్వారా మాత్రమే దిగుమతి అవుతోందని, రష్యన్ దేశాల ద్వారా దిగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం అయినందుకే కేవలం విశాఖ పోర్ట్ నుంచి మాత్రమే దిగుమతులు జరపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇక్కడ నుంచే దేశ మంతటికీ ఈ రసాయనం సరఫరా అవుతోందని, ఏటా సుమారు 2.7 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు విశాఖ ఓడరేవులో దిగుమతి అవుతోందని పవన్ వెల్లడించారు. సరుకును నిల్వ చేయడానికి ఇక్కడ 7 గోదాములు ఉన్నాయని, బీరుట్ ప్రమాదం తర్వాత సరుకు ఉన్న గోదాములను అధికారులు పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.

అనతి కాలంలో విశాఖలో చిన్నచిన్న తప్పిదాల వల్ల పెద్దపెద్ద పారిశ్రామిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలను ఈ సందర్భంలో పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బీరుట్ లో ప్రమాదం జరిగినప్పుడు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు లేవని, మరి ప్రమాదం ఎలా జరిగింది? పేలుడు ఎందుకు సంభవించిందో మన అధికారులు ఆలోచించాలని పవన్ కోరారు. ఒకే చోట ఇంత మొత్తంలో నిల్వలు చేయకుండా వికేంద్రీకరణ జరపడానికి గల అవకాశాలను అన్వేషించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఈ విషయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఉదాసీనత వహిస్తే, జరగరానిది జరిగితే నష్టం అంచనా వేయడానికి కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడ పరిసర ప్రాంతమైన కొండపల్లిలో కూడా 100 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసిందని నగరాలు, జనావాసాలు మధ్య ఈ రసాయనాన్ని నిల్వ చేయడం శ్రేయస్కరం కాదన్నారు. దీనిపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి ఆందోళన సహేతుకంగానే కనిపిస్తోందన్నారు. షిప్‌యార్డ్, విమానాశ్రయం, తూర్పు నావికాదళ కేంద్రం, హెచ్‌పీసీఎల్ సమీపంలోనే అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ చేస్తున్నారని, అప్రమత్తంగా లేకపోతే పెను విపత్తు తప్పదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ సైతం హెచ్చరిస్తున్నారని పవన్ గుర్తు చేశారు. నిల్వ చేస్తున్న గోదాముల దగ్గర తగిన పర్యవేక్షణ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెలపై నిప్పుల కుంపటితో ఉన్న విశాఖ నగరం రక్షణకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేసారు.

Tags :
|

Advertisement