దుబ్బాకలో బీజేపీ విజయంపై స్పందించిన పవన్ కల్యాణ్
By: chandrasekar Wed, 11 Nov 2020 09:48 AM
ఎవరు ఊహించని విధంగా
దుబ్బాకలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దుబ్బాక
ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంపై జనసేన అధినేత పవన్
కల్యాణ్ స్పందించారు. బండి సంజయ్ నాయకత్వ సామర్థ్యం, రఘునందన్ రావు నిబద్ధత
దుబ్బాకలో బీజేపీ విజయానికి కారణమని ఆయన కొనియాడారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ
ప్రకటన విడుదల చేశారు.
ఈ ఉప ఎన్నికల్లో
దుబ్బాకలో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు, బీజేపీ
తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు తెలుపుతున్నట్టు పవన్ చెప్పారు.
బీజేపీపైనా, ఆ పార్టీ నాయకత్వంపైనా ప్రజల నమ్మకానికి నిదర్శనమే
దుబ్బాకలో ఈ విజయం అని పవన్ అభివర్ణించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు
చేపట్టిననాటి నుంచి దుబ్బాక ఉప ఎన్నికల వరకు బండి సంజయ్ చూపిన నాయకత్వ పటిమ ఈ
విజయానికి మార్గం వేసిందని పవన్ అన్నారు.
బీజేపీ తరపున గెలుపొందిన
అభ్యర్థి రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజాసేవ పట్ల ఆయన చిత్తశుద్ధి ఈ గెలుపును
అందించిందని తెలిపారు. దుబ్బాక ఎన్నికల్లో యువకులు విశేషంగా పాల్గొనడం ఒక
శుభపరిణామం అని అన్నారు. రాజకీయాలను సక్రమ మార్గంలో నడిపించడం యువత వల్లే
సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులూ
గెలుపు కారణంగా సంబరాలు చేసుకుంటున్నారు.