ప్రైవేటు రంగానికి భారత అంతరిక్ష ప్రయోగాల్లో భాగస్వామ్యం
By: chandrasekar Tue, 13 Oct 2020 4:13 PM
ప్రైవేటు రంగానికి భారత
అంతరిక్ష ప్రయోగాల్లో భాగస్వామ్యం కల్పించబోతునున్నారు. అందులో భాగంగా అంతరిక్ష
ప్రయోగాలకు చెందిన అన్ని సౌకర్యాలను ప్రైవేటు రంగం వినియోగించుకునేందుకు ఇస్రో
అన్ని ఏర్పాట్లు చేసిందని భారత అంతరిక్ష విభాగం సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్
తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతరిక్ష విభాగంలో తీసుకొచ్చిన
సరికొత్త చారిత్రక సంస్కరణల గురించి మాట్లాడుతూ... భవిష్యత్తులో చేపట్టే
గ్రహాన్వేషణ, అంతరిక్ష యాత్రలు వంటి కార్యక్రమాలు ప్రైవేటు
రంగానికి కూడా అందుబాటులోకి వస్తాయని తెలియచేసారు. స్వావలంబన భారత్ దిశగా మోదీ
ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్లో ఇది కూడా ఒక భాగమని డా.జితేంద్ర సింగ్
ప్రకటించారు. అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం కేంద్రం
ఉద్దేశమని ఆయన తెలిపారు.
భారత అంతరిక్ష రంగ
ప్రయాణంలో భారత ప్రైవేటు రంగం భాగస్వామి అవుతుందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఉపగ్రహ ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు
త్వరలో తగిన స్థానం దొరుకుతుందని తెలిపారు. దేశంలోని అంతరిక్ష సంబంధ కార్యక్రమాలను
"పంపిణీ ఆధారిత నమూనా" నుంచి "గిరాకీ ఆధారిత నమూనా" దిశగా
కొత్త సంస్కరణలు తీసుకెళతాయన్నారు. 'నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్' ఏర్పాటుతో
ఒక యంత్రాంగం అందుబాటులోకి వస్తుందని, సామర్థ్యాలను పెంచుకునేలా, ఇస్రోకు
చెందిన అన్ని సౌకర్యాలు, సంబంధిత ఇతర ఆస్తులను వినియోగించుకునేలా ప్రైవేటు
రంగానికి అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రైవేటు సంస్థలు తమ దరఖాస్తులను పంపడానికి ఒక
వెబ్లింక్ అందుబాటులోకి తెచ్చామన్న డా.జితేంద్ర సింగ్ పరిశ్రమలు, అంకుర సంస్థల నుంచి వచ్చిన దరఖాస్తులను ఉన్నత స్థాయి
కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.