బాలీవుడ్ దిగ్గజ నటుడు పరేష్ రావల్ కు కీలక పదవి కట్టబెట్టిన రాష్ట్రపతి
By: Sankar Thu, 10 Sept 2020 8:56 PM
విలక్షణ నటుడు పరేష్ రావల్ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చీఫ్గా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. పరేష్ రావల్కు నూతన బాధ్యతలను కట్టబెట్టినట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నిర్ధారించారు. పరేష్ నియామకం పట్ల నటుడికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఈ నియామకంతో కళాకారులు, విద్యార్ధులకు మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడు దశాబ్ధాలకు పైగా తన సినీ ప్రస్ధానంలో పరేష్ రావల్ జాతీయ ఫిల్మ్ అవార్డు సహా పలు అవార్డులు అందుకున్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2014లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. సినిమాలతో పాటు నాటక రంగంలోనూ పరేష్ రావల్ చురుకుగా ఉండేవారు. సినిమాల కంటే నాటకాలనే తాను అమితంగా ప్రేమిస్తానని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు..
కాగా తెలుగు ప్రేక్షకులకు కూడా పరేష్ రావల్ సుపరిచితుడే.. తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా చేసిన కొన్ని పాత్రలతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించాడు..ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో లింగం మామ పాత్రలో అభిమానులను అలరించారు