అడ్డుగా ఉన్నాడు అని కొడుకును అమ్మేసిన తల్లితండ్రులు
By: Sankar Tue, 13 Oct 2020 1:40 PM
ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో తల్లిదండ్రుల గొడవకు ఒక చిన్నారి బలయ్యాడు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ఒకరికి ఒకరు దగ్గరవుతారు అనుకున్నారు. అయితే గొడవలు సద్దుమణపోయే సరికి వారు విడిపోవాలనుకున్నారు. వారికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు విడిపోవడానికి అడ్డుగా మారడంతో అతనిని విక్రయించారు. అనంతరం ఎవరి దారి వారు చూసుకున్నారు.
మథిలి మండలం కియాంగ్ పంచాయతీ పరిధిలోని తేలగబేజా గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఆ తల్లి కూడా కన్న ప్రేమ మరచి బాలుడిని విక్రయించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆ బాలుడిని కొనుకున్నారు. అతనిని పశువుల కాపరిగా నియమించారు. పశువులను మేతకు తీసుకువెళ్లను అంటే తనను ఇష్టం వచ్చినట్లు కొట్టేవారని బాలుడు వాసుదేవ్ వాపోయాడు. అంతేకాకుండా అన్నం కూడా సరిగా పెట్టకుండా హింసించేవారని అందుకే అక్కడి నుంచి పారిపోయినట్లు బాలుడు తెలిపాడు.
అక్కడ బాలుడి కథ విన్న గ్రామస్తులు అతడిని అంగన్వాడీ కేంద్రానికి అప్పగించాడు. దీంతో అంగన్వాడీ కార్యకర్తబాలుడిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబం ఈ విషయం తెలుసుకొని అతడిని తమకు అప్పగించాలని అంగన్వాడీ కార్యకర్తను బెదిరించింది.
దీంతో అంగన్వాడీ కార్యకర్త ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రంగప్రవేశం చేసిన ఉన్నతాధికారులు బాలుడి తల్లిదండ్రుల వద్దకు వెళతామంటే పంపిస్తామని లేదా చదువుకుంటానంటే చదివిస్తామని తెలిపారు. మొత్తానికి బాలుడి కథ విన్నవారందరూ అతని పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు.