అనంతపురం జిల్లాలో మిడతల వల్ల ఆందోళన
By: chandrasekar Fri, 29 May 2020 5:20 PM
అనంతపురం లోని రాయదుర్గం దానప్పరోడ్డులో మిడతల దండు కలకలంరేపాయి.
ఓ ఇంటి దగ్గర రెండు జిల్లేడు చెట్లపై మిడతలు అలుముకున్నాయి. దీంతో మిడతల సమూహంపై
ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చాయని స్థానికులు
అనుమానిస్తున్నారు. ఇంకా ఎక్కడైన మిడతలు ఉన్నాయా అని వెదుకుతున్నారు.
దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలపై
మిడతలు దండెత్తాయి. ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రపైకి దూసుకొచ్చాయి. గుంపులు, గుంపులుగా పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. అయితే
తెలుగు రాష్ట్రాలకు సమీపంలో ఉన్న మహారాష్ట్రలో మిడతలు ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణకు 400 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఎప్పుడు ఎటు నుంచి దాడి
చేస్తాయోనని రైతులు, జనాలు
వణికిపోతున్నారు. అధికారులు కూడా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మిడతల దండు లక్షల కొద్ది
వచ్చి పడతాయి. అవి వాలిన చోట పచ్చదనమే కనిపించదు. మిడతల దాడిని ఎదుర్కోవడంపై
పరిష్కారం లేదు. వీటిని తరిమికొట్టేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డప్పుల్ని
కొట్టడం, టపాసులు పేల్చడం, పెద్ద
శబ్దాలు చేయడం వంటి మార్గాలను అనుసరిస్తున్నారు.