మరో సంతోషకరమైన వార్తను వెల్లడించిన ఆక్స్ఫర్డ్...
By: chandrasekar Tue, 24 Nov 2020 5:35 PM
ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్
యూనివర్సిటీ సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ను
అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ భారత్తోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో
ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరో సంతోషకరమైన
వార్తను వెల్లడించింది. మూడవ దశ ట్రయల్స్లో తమ టీకా 70 శాతం
సమర్థవంతంగా పనిచేస్తుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించింది. మూడో
ప్రయోగాల్లో భాగంగా యూకే, బ్రెజిల్లలో 23వేల మంది వాలంటీర్లపై నిర్వహించగా మధ్యంతర ఫలితాల్లో
ఈ విషయం తేలినట్లు ఆక్స్ఫర్డ్ తెలిపింది. ట్రయల్స్లో భాగంగా వాలంటీర్లను రెండు
గ్రూపులుగా విభజించి నెల రోజులకు ఒకటి చొప్పున రెండు వ్యాక్సిన్ డోసులను
అందించారు. మొదటిసారి సగం డోసు రెండోసారి
పూర్తి డోసును అందించిన గ్రూపులోని వలంటీర్లలో 90 శాతం సమర్థతను
గుర్తించారు. అయితే రెండు కూడా ఫుల్ డోసులు అందించిన గ్రూపులోని వలంటీర్లలో 62 శాతం
ప్రభావశీలత మాత్రమే కనిపించింది. మొత్తంగా పరిగణలోకి తీసుకోని ఈ వ్యాక్సిన్ 70 శాతం
సమర్థవంతంగా పనిచేస్తుందని ఆక్స్ఫర్డ్ తెలిపింది.
ఈ ప్రకటనపై భారత ఫార్మ
దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా హర్షం వ్యక్తంచేశారు. ఇప్పటికే నాలుగు కోట్ల
డోసులు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే.. జనవరి నాటికి 10కోట్ల
డోసులు అందిస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే.. ఆస్టాజెనెకా-ఆక్స్ఫర్డ్
తో జతకట్టిన సీరం సంస్థ.. వ్యాక్సిన్ ఉత్పత్తితోపాటు భారత్లో మూడో దశ ట్రయల్స్
నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.