225 రూపాయలకే కరోనా వాక్సిన్ ..సీరమ్ ఇన్స్టిట్యూట్
By: Sankar Fri, 07 Aug 2020 7:03 PM
దేశంలో కరోనా వ్యాక్సిన్ను రూ.225కే అందించనున్నట్లు భారత్కు చెందిన ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ముందంజలో ఉందని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన టీకా ట్రయల్స్లో సత్ఫలితాలను ఇస్తున్నదని, అయితే ఈ టీకా బయటికి వస్తే ధర చాలా ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు చేసింది.
భారత ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసును కేవలం రూ.225కే విక్రయిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ను భారత్లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రెండు కలిసి కరోనా వ్యాక్సిన్ను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్కు సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభంలో 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసి భారత్తోపాటు ఇతర దేశాలకు అందించనుంది.
కాగా కరోనా మహమ్మారి నిర్మునలకు దేశాలు అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ..అమెరికా , రష్యా , చైనా , ఇండియా వంటి దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి ..రష్యా , బ్రిటన్ , అమెరికా క్లినికల్ ట్రైల్స్ చివరి దశకు వచ్చాయి ..ఇండియాలో కూడా క్లినికల్ ట్రయల్స్ రెండవ దశకు చేరుకున్నాయి ..