యుట్యూబ్ చానెల్స్ , ఓటిటి ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్
By: Sankar Wed, 11 Nov 2020 4:31 PM
ఓటీటీలలో పెరుగుతోన్న అశ్లీలతను కట్టడి చేసేందుకు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ కంటెంట్లు, ఆన్లైన్ ఫిలిమ్స్, వీడియో ప్రోగ్రామ్స్, డిజిటల్ న్యూస్, కరెంట్ అఫైర్స్ లాంటి వాటన్నిటినీ కేంద్ర సమాచార శాఖ పరిధిలోకి తీసుకొస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. దీనితో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి టాప్ ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఇకపై కేంద్రం నియంత్రణలో ఉండనున్నాయి. ప్రస్తుతం, డిజిటల్ కంటెంట్ను నియంత్రించే చట్టం లేదా స్వయం ప్రతిపత్త అధికారిక సంస్థ లేదన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ఆదేశాలపై ప్రాధాన్యత సంతరించుకుంది..
కాగా, గతంలో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్కు కేంద్రం పలు సూచనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూస్ బ్రాడ్కాస్టర్స్ స్టాండర్డ్ అథారిటీ తరహాలో ఓటీటీలు సైతం స్వీయ-నియంత్రణ సంస్థతో రావాలని కోరింది. ఈ క్రమంలోనే జనవరి 2019న దాదాపు ఎనిమిది వీడియో స్ట్రీమింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు స్వీయ-నియంత్రణ కోడ్కు సంబంధించిన మార్గదర్శకాలపై సూత్రప్రాయంగా సంతకం చేశాయి. అయితే ఆ ఓటీటీ లు అవలంబించిన కోడ్పై పలు అభ్యంతరాలు ఉండటంతో దానిని కేంద్రం నిరాకరించింది