ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి నిజం చెప్పాలని విపక్ష పార్టీలు డిమాండ్
By: chandrasekar Thu, 18 June 2020 1:49 PM
లఢక్లోని గాల్వాన్
లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ప్రధాని నరేంద్ర
మోదీ మౌనం వీడి నిజం చెప్పాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఘర్షణలో 20 మంది
భారత సైనికులు అమరులు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు, నిజాన్ని
ఎందుకు దాస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అసలు ఏమి
జరిగిందన్నది అందరికీ తెలియాల్సి ఉన్నదంటూ ట్వీట్ చేశారు. మన సైనికులను చంపడానికి, మన
భూమిని ఆక్రమించడానికి చైనాకు ఎంత ధైర్యం అని రాహుల్ ప్రశ్నించారు.
మే 5 నుంచి
ప్రధాని మోదీ మౌనం వహించడం ఆందోళన కలిగిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత
చిదంబరం విమర్శించారు. దేశంలోకి విదేశీ సైనికులు చొరబడుతుంటే ఏడు వారాలుగా ఒక్క
మాటైనా మాట్లాడని ప్రధాని ఎవరైనా ఉంటారా అని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్
బుధవారం వరుస ట్వీట్లలో మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ‘ఇంతటి దారుణానికి
పాల్పడిన చైనాకు ఎప్పుడు గట్టిగా బుద్ధి చెబుతాం? కాల్పులు జరగకుండానే 20 మంది
సైనికులను కోల్పోయాం.. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? చైనా సైనికులు ఎంత మంది
మరణించారు? చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందా? మోదీజీ
ఈ పోరాట సమయంలో మేము మీ వెంటే ఉంటాం. అయితే వాస్తవం ఏమిటన్నది తెలియాలి. దయచేసి
నోరు విప్పి మాట్లాడండి. నిజం ఏమిటన్నది దేశం తెలుసుకోవాలనుకుంటున్నది.. జైహింద్’అని
ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీని ధైరమంతుడైన సైనికుడిగా అభివర్ణించిన
సంజయ్ రౌత్, ఆయన నేతృత్వంలో భారత్ కచ్చితంగా ప్రతీకారం
తీర్చుకుంటుందంటూ మరో ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ దేశ రక్షణలో
విఫలమయ్యారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఈ విషయాన్ని ఆయన
అంగీకరించాలని డిమాండ్ చేశారు. గంభీర్యాన్ని వీడి వాస్తవాలను దేశానికి
చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశ రక్షణలో విఫలమైనట్లు
ఆయన అంగీకరిస్తారా? మన భూభాగాన్ని ఆక్రమించిన చైనాతో చర్చలు జరుపడం
తప్పని ఒప్పుకుంటురా? అని ప్రశ్నించాంరు.
చైనాతో ఘర్షణపై మోదీ మోనం
వహించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తప్పుపట్టింది. మెరుపుదాడులు నిజమైతే
ఇప్పుడెలా స్పందిస్తారని ప్రశ్నించింది. ‘మెరుపుదాడులు పేరు చెప్పుకుని 2019
ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అయితే మెరుపుదాడులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు
చూపలేదు. ఇప్పుడు నిజంగా అమరులైన 20 మంది సైనికుల ముఖాలు మనవైపు ప్రశ్నార్థకంగా
చూస్తున్నాయి. కానీ ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు’అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
ట్వీట్ చేశారు. చైనాతో ఘర్షణపై ప్రధాని మోదీ వాస్తవాన్ని వెల్లడించాలని ఎస్పీ
అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని
నిర్వహించాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కోరారు.