వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు సభలో ఆందోళన
By: chandrasekar Mon, 21 Sept 2020 11:09 AM
న్యూఢిల్లీ: వ్యవసాయ
బిల్లులపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. రైతుల కష్టాలను దూరం చేసే ప్రక్రియలో
సహకరించకుండా ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత 70
ఏండ్లుగా అన్యాయాన్ని ఎదుర్కొంటున్న రైతులు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని
ప్రభుత్వంలో విముక్తి పొందారని నడ్డా
తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్షాల చర్యను
బీజేపీ ఖండిస్తున్నదని ఆయన చెప్పారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం అనంతరం రాజ్యసభ వాయిదా
పడిన తర్వాత నడ్డా మీడియాతో మాట్లాడారు. బిల్లులను అడ్డుకునేందుకు విపక్ష పార్టీలు
చేసిన తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షం
ప్రోటోకాల్ను ఉల్లంఘించారని, ఛైర్మన్ దానిని గమనించి చర్యలు తీసుకుంటారని
పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా పనిచేయాలని నడ్డా అన్నారు. ఈ
నేపథ్యంలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ను
కోరతామని నడ్డా తెలిపారు.
రాజ్యసభలో ఆదివారం వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్ష
సభ్యులు సభలో ఆందోళన చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
అగ్రి బిల్లులపై వివరణ ఇచ్చారు. అయితే సభ మధ్యాహ్నం ఒంటి గంటకు సమాప్తం
కావాల్సిన తరుణంలో బిల్లులను హడావుడిగా పాస్ చేసేందుకు డిప్యూటీ చైర్మన్
హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రయత్నించారు. సవరణలపై సభ్యుల వివరణ తీసుకోకుండానే
వాయిస్ ఓటుకు వెళ్లారు. దీంతో టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ డిప్యూటీ చైర్మన్ చైర్
వైపు దూసుకువెళ్లారు. తన చేతిలో ఉన్న రూల్ బుక్ను ఆయనకు చూపించే ప్రయత్నం
చేశారు. కొందరు ఎంపీలు కూడా పోడియం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని
మార్షల్స్ అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళం మధ్య సభను మధ్యాహ్నం 1.41
నిమిషాల వరకు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన రాజ్యసభలో మళ్లీ నిరసనలు
పార్రంభమైయ్యాయి. అయినప్పటికీ డిప్యూటీ చైర్మన్ వాయిస్ ఓటు ద్వారా మూడు అగ్రి
బిల్లులను పాస్ చేసి సభను సోమవారానికి వాయిదా వేశారు.