ఓపెన్ రూఫ్ డబుల్ డెక్కర్ బస్సులు...కోల్కతాలో కనువిందు
By: chandrasekar Wed, 14 Oct 2020 6:59 PM
పశ్చిమ బెంగాల్ రాజధాని
కోల్కతాలో ప్రతిష్ఠాత్మక ఓపెన్ రూఫ్ డబుల్ డెక్కర్ బస్సులు తిరిగి కనువిందు
చేయనున్నాయి. పర్యాటకులను అమితంగా ఆకర్శించే ఈ బస్సులను తిరిగి ప్రవేశపెట్టేందుకు
మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతానికి రెండు బస్సులను నగర
రోడ్లపై తిప్పేందుకు అనుమతించారు. ఓపెన్ రూఫ్ డబుల్ డెక్కర్ బస్సులను
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూజాకార్యక్రమాల అనంతరం ప్రారంభించారు. 1920 ల్లో
ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్సులను మొన్నటి వరకు అధికారంలో ఉన్న వామపక్ష
ప్రభుత్వం 1990 ప్రారంభంలో దశలవారీగా తొలగించింది.
2005 లో చివరిలో ఈ బస్సులు నగర రహదారుల నుంచి కనుమరుగైంది. 2011 లో
అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఐకానిక్ బస్సులను తిరిగి తీసుకురావాలని సీఎం మమతా
బెనర్జీ.. రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. “ప్రస్తుతం రెండు ఓపెన్ రూప్ డబుల్
డెక్కర్ బస్సులు తీసుకువస్తున్నాం. వీటిని పూజ పరిక్రమ, పండల్
హోపింగ్ కోసం ఉపయోగిస్తారు. అనంతరం వీటిని పర్యాటక రంగం కోసం ఉపయోగిస్తారు.
వాణిజ్య సేవలకు ఉద్దేశించినవి కావు” అని రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొత్త
బస్సుల్లో ఆటోమేటిక్ డోర్స్, డెస్టినేషన్ బోర్డులు, పానిక్ బటన్లు, సీసీటీవీ
కెమెరాలు వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. పాత బస్సులకు రెండు తలుపులు ఉండగా వీటికి ఒకే తలుపు ఉంటుంది. 51
సీట్లలో ఎగువ డెక్లో 16 సీట్లు ఉంటాయి.
బస్సులను నీలం, తెలుపు
రంగులలో పెయింట్ చేయనున్నారు. ఇంధనం ఖర్చులు రెండింతలు అవుతున్న కారణంగా పాత డబుల్
డెక్కర్ బస్సులను దశలవారీగా తొలగించినట్లుగా తెలుస్తున్నది. అలాగే బీఎస్-4 మోడల్
కావడం వల్ల కాలుష్యం పెరిగిపోతున్నదని అధికారులు చెప్తున్నారు. నవరాత్రి పండుగ
సీజన్ ఇప్పటికే ప్రారంభమై షాపింగ్ పూర్తి స్థాయిలో జరుగుతుండగా కొన్ని ప్రదేశాలలో దుర్గాదేవి విగ్రహాలు
ఇప్పటికే పండళ్లకు వచ్చాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజుల్లో డజన్ల కొద్దీ
పూజలను ప్రారంభించబోతున్నారు.