బీఆర్కే భవన్లో ఒకరికి కరోనా పాజిటివ్
By: chandrasekar Tue, 09 June 2020 11:26 AM
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బూర్గుల రామకృష్ణారావు(బీఆర్కే) భవన్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో పని చేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఏడో అంతస్తులోని ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది అంతా హోంక్వారంటైన్లో ఉన్నారు. ఎనిమిదో అంతస్తు ఆర్థిక శాఖలోనూ కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే కొత్తగా 154 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 132 మంది ఉండగా, రంగారెడ్డి 12, మేడ్చల్ 3, యాదాద్రి భువనగిరి 2, సిద్దిపేట 1, మహబూబాబాద్ 1, సంగారెడ్డి 1, నాగర్కర్నూల్ 1, కరీంనగర్ ఒకరు ఉన్నారు. ఒక్కరోజే 14 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,650 కేసులు నమోదు కాగా, ఇందులో 137 మంది మరణించారు. 1,742 మంది చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1,771 మంది గాంధీ ఆస్పత్రిలో చకిత్స పొందుతున్నారు.