కాళ్లు, చేతులు కట్టేసి బతికుండగానే పాతిపెట్టారు... ఎందుకో తెలుసా...?
By: Anji Wed, 14 Oct 2020 5:00 PM
చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో 82 ఏళ్ల వృద్ధుడిని సజీవ సమాధి చేశారు సొంత బంధువులు. ఈ ఘటన మేఘాలయలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వృద్ధుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ ఖాసీ హిల్స్ ప్రాంతానికి చెందిన మోరిస్ మారంగర్ అనే వృద్ధుడిని ఈ నెల 7న అతడి బంధువులు బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లారు. అతడు చేతబడి చేస్తున్నానంటూ ఒకచోటికి తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి బతికుండగానే పాతిపెట్టారు. అయితే తమ తండ్రి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో వృద్ధుడి పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ వృద్ధుడి మేనల్లుళ్లు డేనియల్, జేల్స్, డిఫర్వెల్లను అరెస్ట్ చేశారు. మరుసటి రోజు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా తమ కుటుంబ సభ్యులపై మోరిస్ చేతబడి చేశాడని ప్రధాన నిందితులైన మేనల్లుళ్లు ఆరోపిస్తున్నారు. తమ ఇంట్లో సోదరిపై చేతబడి చేశాడని, మోరిస్ మరణించిన తరువాత ఆమె కోలుకుందని వారు చెబుతున్నారు. ఇక ఈ కేసును మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.