కోజికోడ్ లో జరిగిన ప్రమాదంలో విమానం నుంచి బ్లాక్బాక్స్ను గుర్తించిన అధికారులు
By: chandrasekar Sat, 08 Aug 2020 4:20 PM
కేరళ రాష్ట్రంలోని
కోజికోడ్లో శుక్రవారం రాత్రి విమానం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోజికోడ్
విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం నుంచి బ్లాక్బాక్స్ను
స్వాధీనం చేసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. బ్లాక్బాక్స్లోని డిజిటల్
ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్డీఆర్), కాక్పిట్
వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నాయి.
దీని ద్వారా విమానం ఎత్తు, స్థితి, వేగానికి సంబంధించిన వివరాలతోపాటు ప్రమాద సమయంలో
పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా లభించనున్నాయి. డేటా, కాక్పిట్ల్లో చిన్న చిప్స్ ఉంటాయి. ఆ పరికరాలు
వందల సంఖ్యలో డేటాను సేకరిస్తుంటాయి. విమాన పర్ఫార్మెన్స్కు సంబంధించి
వివరాలు వాటిల్లో ఉంటాయి. స్పీడ్, హైట్, రేట్ ఆఫ్ క్లైంబ్ ఆర్ డిసెంట్, ఫ్లయిట్ పాత్, లొకేషన్, ఫుయల్ లెవల్స్, ఇంజిన్
టెంపరేచర్, ఎగ్జాస్ట్, ఫ్లాప్ పొజిషన్ లాంటి అంశాలను స్టడీ చేసే వీలు
ఉంటుంది. వీటితో పాటు ఇతర విమాన వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయన్న విషయాలు
కూడా తెలుస్తాయి. దీంతో ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని
అధికారులు తెలిపారు.
అయితే కాక్పిట్ డేటా
రికార్డర్లలో ఉన్న సమాచారం మేరకే విమాన ప్రమాదం గురించి వివరాలు బయటకు వస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బాక్స్ను అధ్యయనం చేసే ప్రత్యేక ఏజెన్సీలు కొన్నే
ఉన్నాయి. వాస్తవానికి చాలా రకాల పద్ధతుల్లో
బ్లాక్బాక్స్ను స్టడీ చేసే విధానాలు ఉన్నాయి. అయితే పశ్చిమ దేశాలు అధ్యయనం
చేయడంలో అధికంగా అనుభవం కలిగినవారు. మరోవైపు, కేంద్ర
విమానయాన శాఖ మంత్రి హరదీప్ పురీ కోజికోడ్ చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని
పరిశీలించిన అనంతరం పౌర విమానయాన శాఖ అధికారులు, నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు.
విమాన ప్రమాదంలో ప్రాణాలు
కోల్పోయిన పైలట్ దీపక్ వసంత్ సాథే తల్లి మాట్లాడుతూ తను ఓ గొప్ప కొడుకని, ఇతరులకు సాయం చేయడంలో ముందుండేవాడని కన్నీటి
పర్యంతమయ్యారు. ఇప్పటికీ ఉపాధ్యాయులు అతడిని మెచ్చుకుంటారని దీపక్ తల్లి నీలమ సాథే
ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయి నుంచి కోజికోడ్కు వస్తున్న ఎయిరిండియా విమానం రన్వేపై
అదుపుతప్పి జారిపడటంతో రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 19 మంది ప్రాణాలు కోల్పోగా 123 మంది
గాయపడ్డారు. వీరిలో ఓ గర్భిణి, నలుగురు
చిన్నారులు సహా 23 మంది
పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చుట్టుపక్కల 13 ఆస్పత్రుల్లో 171 మంది
చికిత్స పొందుతున్నారు. అధికారులు దీనిపై పూర్తి వివరాలు కోసం అధ్యయనం
చేస్తున్నారు.