ధరణిలో ఉన్న డేటా ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలి ...కొత్తగూడెం కలెక్టర్ ఏంవి రెడ్డి
By: Sankar Fri, 23 Oct 2020 11:02 PM
ధరణి పోర్టల్ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పోర్టల్ నిర్వహణకు సిద్ధం కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో కలెక్టర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ధరణి పోర్టల్ నిర్వహణకు ప్రతి మండలానికి ప్రాక్టీస్ నిమిత్తం కొన్ని లాగిన్స్ కేటాయించారు. వీటి నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలపై కలెక్టర్ భేటీలో చర్చించారు. రిజిస్ట్రేషన్లో రికార్డే ప్రామాణికమని చెప్పారు. తొలుత 4 రకాలైన డాక్యుమెంట్లకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. తొలుత సేల్, పార్టిషన్, సక్సెషన్, గిఫ్ట్ డీడ్ భూ రికార్డులకు సంబంధించి ధరణి వెబ్సైట్లో ఏ డేటా ఉంటే ఆ వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. ఇతర రికార్డులను పరిశీలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన రోజు నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మండలాల్లోనే జరుగుతాయన్నారు. తొలిదశలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి తహసీల్దార్లకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.