రూ.12కోట్ల టోకరాకు నూతన్ నాయుడు స్కెచ్
By: Dimple Sat, 12 Sept 2020 09:34 AM
విశాఖలో దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడైన నూతన్నాయుడు ఇద్దరికి బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏకంగా రూ.12 కోట్లకు టోకరా వేయడంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా రావికమతం ప్రాంతానికి చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్రెడ్డి మిత్రులు. హైదరాబాద్లో నూకరాజు సీసీకెమెరాలు, శ్రీకాంత్రెడ్డి స్థిరాస్తి వ్యాపారం చేసేవారు.
లావాదేవీల్లో భాగంగా నూతన్నాయుడితో వారికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలో వారికి ఎస్బీఐలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికాడు. ఆ బ్యాంకులో దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు కోసం శ్రీకాంత్రెడ్డి రూ.12 కోట్లు, ఉద్యోగం కోసం నూకరాజు రూ.5 లక్షలు చెల్లించారు. రెండేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయామని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు వివరించారు.
అంత భారీగా డబ్బులిచ్చే స్థాయి శ్రీకాంత్రెడ్డికి ఉందా లేదా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు మహారాణిపేట సీఐ సోమశేఖర్ తెలిపారు. నూతన్నాయుడుకి సహకరించిన శశికాంత్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని చెప్పారు. ఇప్పటికే శిరోముండనం కేసులో అరెస్టై జైల్లో ఉన్న నూతన్నాయుడిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. మోసం కేసు కూడా విచారణ చేయాలని నిర్ణయించారు.