అభ్యంతరకర వ్యాఖ్యలను చేసినందుకు కుష్బూ పై పోలీస్ కేసు నమోదు
By: Sankar Wed, 14 Oct 2020 8:43 PM
దివ్యాంగులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్పై తమిళనాడులోని వివిధ జిల్లాల్లో పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) బుధవారం తెలిపింది.
సోమవారం ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ‘మానసిక వికలాంగుల’ పార్టీ నుంచి నిష్క్రమించానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ మాట్లాడుతూ రాజకీయ నాయకురాలిపై దాదాపు 30 పోలీస్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారన్నారు. చెన్నై, కంజిపురం, చెంగల్పేట, మధురై, కోయంబత్తూరు, తిరువూర్ తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.
కుష్బూ తన ప్రత్యర్థులపై రాజకీయంగా మాట్లాడేందుకు హక్కులు ఉన్నప్పటికీ.. వైకల్యం, ప్రతికూల చిత్రణను సూచించే పదాలను వాడడం ‘ఆమోదయోగ్యం కాదు’ అని అధికారి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను వికలాంగుల హక్కుల కోసం జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తుందన్నారు. ఇలాంటి అవమానాలను చట్టం ద్వారా నిషేధించారని దేశానికి, కుష్బూ వంటి వారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు