రాజకీయ పార్టీలకు షాకిచ్చిన ఈసీ ..ఇక నుంచి రిజిస్ట్రేషన్ కు ఏడు రోజులే గడువు
By: Sankar Thu, 08 Oct 2020 9:58 PM
రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే నోటిఫికేషన్ గడువును భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కుదించింది. ఇప్పటి వరకు 30 రోజుల గడువు ఉండగా దీనిని ఏడు రోజులకు తగ్గించింది.
ఈ నెల 7తేదీ లేదా దానికి ముందుగా బహిరంగ నోటిఫికేషన్ ఇచ్చిన రాజకీయ పార్టీలకు ఇది వర్తిస్తుందని ఈసీ తెలిపింది. ఈ నెల 20 వరకు ఈ సడలింపు అమలులో ఉంటుందని పేర్కొంది. ఒకవైపు కరోనా, మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు మినహాయింపు ఇచ్చింది. తుది దశ పోలింగ్ కోసం నామినేషన్ దాఖలకు చివరి తేదీ అయిన 20 వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
మరోవైపు కరోనా నేపథ్యంలో స్టార్ ప్రచార వ్యక్తుల సంఖ్యను కూడా ఈసీ కుదించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరుఫున గతంలో 40 మంది స్టార్ ప్రచారకులను అనుమతించగా వారి సంఖ్యను 30కి తగ్గించింది. అలాగే గుర్తింపు పొందని పార్టీల ప్రచారకర్తల సంఖ్యను 20 నుంచి 15కు కుదించింది. సంబంధిత ప్రచారకుల జాబితా సమర్పణ గడువును ఏడు నుంచి పది రోజులకు పొడిగించింది. ఈ మేరకు పునరుద్ధరించిన మార్గదర్శకాలను ఈసీ విడుదల చేసింది.