దివంగత ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య సంస్మరణ సభ ..పాల్గొన్న పలువురు మంత్రులు
By: Sankar Sun, 13 Dec 2020 10:28 PM
నాగార్జున సాగర్ ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య అకాల మృతితో తెరాస పార్టీకి , ఆ నియోజక వర్గానికి తీరని లోటు ఏర్పడింది..అయితే నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధియే దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని పలువురు నాయకులు అన్నారు.
నల్లగొండ జిల్లా హాలియాలో ఆదివారం నిర్వహించిన నోముల నర్సింహాయ్య సంస్మరణ సభకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కర్రావు, రవీంద్రకుమార్ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే నెల్లికల్లు, కుంకుడుచెట్టు తాండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు గురించి ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. నోముల కలలను నెరవేర్చేలా సీఎం కేసీఆర్ ఇటీవలే ఈ పథకాలను నియోజకవర్గానికి ప్రకటించారన్నారు