జిహెచ్ఎంసి ఎన్నికలు ...మొదలయిన నామినేషన్ల పర్వం
By: Sankar Wed, 18 Nov 2020 8:38 PM
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి రెండు నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి మూడు, టీడీపీ నుంచి ఐదు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మూడు, గుర్తింపు పొందిన పార్టీ నుంచి మరో నామినేషన్ దాఖలయ్యాయి. అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి చాంబర్లోకిఅనుమతి ఇస్తున్నారు. నామినేషన్ల నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నెల 20వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగరంలోని ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపునకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 20 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. నిన్న ఒక్క రోజే దాదాపు నాలుగు వేలకు పైగా ఫ్లెక్సీలు, బ్యానర్ల వీరు తొలగించారు.