ధోని ఎప్పుడు అలాంటి కోరిక కోరలేదు ..ఫేర్ వెల్ మ్యాచ్ ఉండదు
By: Sankar Sun, 16 Aug 2020 6:24 PM
మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించడం కుదరదని ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వద్ద ధోని అలాంటి ప్రతిపాదన ఎప్పుడూ చేయలేదని ఆయన చెప్పారు. ఆయన కోరనప్పుడు ఫేర్వెల్ మ్యాచ్ అనేది ఉండబోదన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ శనివారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఆపాదించుకున్న ధోని జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జన్మించడంతో ఆయన రిటైర్మెంట్ ప్రకటనపై ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. మాహీ కోసం వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేస్తే జార్ఖండ్ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుందని ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.
కాగా, సీఎం సోరెన్ ప్రతిపాదనపై ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. అలాంటి మ్యాచ్ను ధోని ఎప్పుడూ కోరలేదని, దీంతో ఇది జరిగే అవకాశం లేదని చెప్పారు.కాగా ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడు అయిన ధోని ఇలా అత్యంత సాధారణంగా రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల యావత్ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు ..