కరోనా వచ్చిన వారిలో 40 శాతం మందికి జ్వరం లక్షణాలు లేవు.. తాజా అధ్యయనంలో వెల్లడి
By: Sankar Wed, 19 Aug 2020 2:59 PM
తీవ్రమైన జ్వరం వచ్చి.. పొడి దగ్గుతో పాటు ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటే కరోనా 99 శాతం సోకి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఈ లక్షణాలు ఉన్న వారు కరోనా టెస్టులు చేయించుకుంటే కచ్చితంగా 99 శాతం పాజిటివ్ ఫలితమే వస్తుంది. కానీ ఎలాంటి జ్వరం లేని వారికి కూడా కరోనా సోకిందని పుణెకు చెందిన దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రి వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది.
మొత్తం 5 వేల మందిని స్టడీ చేయగా, ఇందులో 40 శాతం మందికి ఎలాంటి జ్వరం లేదు. అయినప్పటికీ కరోనా పాజిటివ్ ఫలితం నిర్ధారణ అయింది. మిగతా 60 శాతం మందికి స్వల్పంగా జర్వం ఉన్నట్లు నిర్ధారించారు. కొందరికైతే టెంపరేచర్ 102 ఫారెన్హిట్కు పైగానే నమోదైనట్లు అధ్యయనంలో తేలింది.
కరోనా సోకిన వారిలో సాధారణంగా జ్వరం, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు అనేవి సహజంగా కనిపించేవి. ఇవే కాకుండా కొందరికి గొంతు నొప్పి రావడం, వాసనను కోల్పోవడం, తలనొప్పి రావడం కూడా కనిపించాయి. కరోనా సోకిన వారందరికీ జ్వరం రావాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు.
కరోనా సోకిన వారిలో అత్యధిక మంది తలనొప్పితో బాధపడుతున్నట్లు పుణె వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సోకిన వారిలో ముక్కు కారడం అనేది సాధారణం అని పేర్కొన్నారు. మొత్తం ఐదు వేల మందిని స్టడీ చేస్తే అందులో 31 శాతం మంది రుచిని కోల్పోతే.. 15 శాతం మంది వాసనను కోల్పోయినట్లు తెలిపారు.