Advertisement

  • నివర్ పెను తుఫానుగా రూపాంతంరం...చెన్నై అలెర్ట్...

నివర్ పెను తుఫానుగా రూపాంతంరం...చెన్నై అలెర్ట్...

By: chandrasekar Wed, 25 Nov 2020 3:20 PM

నివర్ పెను తుఫానుగా రూపాంతంరం...చెన్నై అలెర్ట్...


బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ పెను తుఫానుగా రూపాంతంరం చెంది బుధవారం సాయంత్రం తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. చెన్నై సమీపంలోని మామళ్లపురం పుదుచ్చేరిలోని కరైకాల్‌కు మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ పేర్కొంది. గత ఆరు గంటల నుంచి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోన్న నివర్ తుఫాను ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఈశాన్యంగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఈశాన్యంగా 310 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.

సముద్రంలో ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఉండటంతో పెను తుఫానుగా మారి తీరంవైపుగా వస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో ఆ తర్వాత 26, 27న తమిళనాడులోని కడలూర్‌, విళ్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాల్లో, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. తుఫాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. 2015 డిసెంబరు వరదలకు చెన్నై నగరం చిగురుటాకులా వణికిన విషయం తెలిసిందే.

నాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్షాలు కురవడం వల్ల చెరువులు, కుంటలు గండ్లు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలతో మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 13 రైళ్లను రైల్వేశాఖ దారి మళ్లించగా 24 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. తుఫాన్ కారణంగా చెన్నై లోకల్ రైళ్లు మొత్తం రద్దు అయ్యాయి. 7 జిల్లాల్లో రవాణా వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. మరోవైపు, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాంచీపురం, పుదుకొట్టై, తంజావురు, తిరువరూర్, నాగపట్నంలో భారీ‌ వర్షాలు, విల్లుపురం, తిరువణ్ణామలై, చెంగల్‌పట్టులో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మొత్తం 5,505 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అలాగే, లోతట్టు ప్రాంతాలను మొత్తం 4,133గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో 4,713 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Tags :
|
|

Advertisement