ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానల్లో నితిన్ మీనన్ ..అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డు
By: Sankar Mon, 29 June 2020 5:34 PM
వచ్చే 2020-21 సీజన్లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తమ అంపైర్ల ఎలైట్ ప్యానల్ను ప్రకటించింది. ఇందులో భారత్కు చెందిన అంపైర్ నితిన్ మీనన్కు చోటు కల్పిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. భారత్కు చెందిన అంపైర్ నితిన్ను ఎలైట్ ప్యానల్ చేర్చే విషయాన్ని ఐసీసీ సోమవారం ప్రకటించింది. దాంతో ఈ సీజన్లో ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్న పిన్నవయస్కుడిగా 36 ఏళ్ల నితిన్ నిలిచారు.
ఇప్పటివరకూ మూడు టెస్టులకు, 24 వన్డేలకు, 16 టీ20లకు నితిన్ అంపైర్గా వ్యహరించారు. ఇంగ్లండ్కు చెందిన నిగెల్ ఎల్లాంగ్ స్థానంలో నితిన్కు అవకాశం దక్కింది. గతంలో శ్రీనివాస్ వెంకట్రాఘవన్, సుందర్ రవిలు ఐసీసీ ఎలైట్ ప్యానల్లో పని చేసిన భారత అంపైర్లు. కాగా, గతేడాది సుందర్ రవిని ఐసీసీ ఎలైట్ ప్యానల్ నుంచి ఐసీసీ తప్పించింది..
అంతకుముందు ఎమిరేట్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ అంపైర్స్ ప్యానల్లో ఉన్న నితిన్ను.. ఎలైట్ ప్యానల్ అంపైర్గా ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్, మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్, మ్యాచ్ రిఫరీలు రంజన్ మదుగలే, డేవిడ్ బూన్లతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. చాలా ఏళ్లుగా భారత అంపైర్ల స్టాండర్డ్స్పై విమర్శలు వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరొకసారి భారత్కు చెందిన అంపైర్కు ఎలైట్ ప్యానల్లో చోటు దక్కడం విశేషం. కొంతకాలంగా నితిన్ అంపైర్గా కొన్ని కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్న క్రమంలోనే అతనికి ఎలైట్ ప్యానల్లో చోటు కల్పించారు.