బాణాసంచా కర్మాగారంలో సంభవించిన పేలుడులో 9 మంది మృతి
By: chandrasekar Fri, 04 Sept 2020 10:02 PM
శుక్రవారం ఉదయం ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాల బారినపడ్డారు. కడలూరు జిల్లా కట్టమన్నార్ కోయిల్ వద్ద ఈ ఘోరం జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వైద్యం కోసం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఫ్యాక్టరీలో కార్మికులు పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. అందులోనే ఉన్న కొంత మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.
పేలుడు ధాటికి ఆ కర్మాగారం కుప్పకూలిపోయింది . ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సంఘటన ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేపట్టారు.