రియాతో సుశాంత్ మరణంపై 9 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ
By: chandrasekar Sat, 08 Aug 2020 7:21 PM
సుశాంత్ సింగ్ మరణంపై 9 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రియాతో
విచారణ జరిపింది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు
అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆత్మహత్యగా ద్రువీకరించబడిన ఈ కేసు విచారణలో భాగంగా
సుశాంత్తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరినీ విచారిస్తూ అతని ఆత్మహత్యకు ప్రేరేపించిన
అంశాలపై కీలక సమాచారం రాబడుతోంది పోలీస్ యంత్రాంగం.
కేసు సీబీఐకి ఇటీవలే
అప్పగించడంతో దర్యాపు వేగవంతం చేయబడింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు
శుక్రవారం రోజు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని సుదీర్ఘంగా విచారించారు. ఏకంగా 9 గంటల పాటు రియాతో డైరెక్టుగా విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ (ED) పలు
ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ చుక్కలు చూపించింది. బ్యాంక్ అకౌంట్లు, ముంబైలో విలువైన ఆస్తులు, కంపెనీల ఏర్పాటు లాంటి అంశాలపై ఫోకస్ పెట్టి కీలక
సమాచారాలు సేకరించింది.
శుక్రవారం రోజు ఉదయం 11 గంటల 50
నిమిషాలకు మొదలైన ఈడీ విచారణ రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు సాగడం విశేషం. సుశాంత్ అకౌంట్ నుంచి
రూ.15 కోట్లు బ్యాంక్ నుంచి బదిలీ అయ్యాయని పేర్కొంటూ జూలై
31వ తేదీన సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో పిటిషన్
వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ స్థాపించిన నాలుగు కంపెనీల గురించి
రియాపై ప్రశ్నలు వేశారు ఈడీ అధికారులు. అయితే అందులో రెండు కంపెనీలు రిజిస్టర్
అయ్యాయని, మరో రెండు కంపెనీలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో
ఉన్నాయి అని రియా చెప్పినట్లు తెలిసింది.
రియా చక్రవర్తి పన్ను
చెల్లింపు పత్రాలు, ఆదాయ
వనరులు, బిజినెస్ డీల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారట
ఈడీ అధికారులు. కాగా ఈ దర్యాప్తులో భాగంగా అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు రియా
చక్రవర్తి సమాధానాలు చెప్పడానికి మొండికేసిందని తెలుస్తుండటం పలు అనుమానాలకు
తావిస్తోంది. రియాను పలు విధాలుగా ప్రశ్నించి ఎలాగోలా కీలక విషయాలు రాబట్టిన ఈడీ
అధికారులు ఈ రోజు శనివారం సుశాంత్ మేనేజర్ సిద్ధార్థ పితానిని విచారిస్తున్నారు.
దీంతో మిస్టరీ సినిమాను తలపిస్తున్న సుశాంత్ సూసైడ్ మిస్టరీకి ఎలాంటి ముగింపు
లభిస్తుందా? అని
ఎదురుచూస్తున్నారు సుశాంత్ ఫ్యాన్స్. సుశాంత్ మరణంపై మిస్టరీని ఛేదించాలని చాలా
అతృతతో ప్రజలందరూ వేచి చూస్తున్నారు.