ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కు మళ్ళీ చుక్కెదురు
By: chandrasekar Wed, 04 Nov 2020 12:38 PM
ఏపీ స్థానిక సంస్థల
ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కు మళ్ళీ చుక్కెదురైంది. తమ ప్రాణాలను పణంగా
పెట్టలేమన్న ఉద్యోగ సంఘాలు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, ప్రభుత్వం
నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండటం లేదంటూ
నిమ్మగడ్డ రమేష్ హైకోర్టు మెట్లెక్కినా పరిస్థితిలో మార్పు రావట్లేదు. తాజాగా, ఏపీ
ప్రభుత్వ ఉద్యోగులు ఈసీ నిమ్మగడ్డ రమేష్కు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కరోనా
నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని ఏపీ
ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన
విశాఖపట్నంలో మీడియాతో మాట్లడుతూ కరోనా పేరు చెప్తేనే అందరూ భయపడే పరిస్థితి ఉన్న
సందర్భంలో ఎన్నికలు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని తేల్చి చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల
నిర్వహణలో ఉద్యోగుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు. కరోనా
తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే త్వరలోనే
ఉద్యోగులందరూ అమరావతి నుంచి విశాఖపట్నం వచ్చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి
వెల్లడించారు. ఉద్యోగులంతా విశాఖను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారని
పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో నిలిపివేసిన జీతాలను ఈ నెల నుంచి
ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే మూడు
డీఏలు ఇవ్వడంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. గత కొంత కాలంగా స్థానిక
సంస్థల ఎన్నికలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.