ఆ రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు బాణాసంచా నిషేధం...
By: Sankar Mon, 09 Nov 2020 1:42 PM
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్ 9(సోమవారం) అర్థరాత్రి నుంచి నెలాఖరు వరకు బాణాసంచా అమ్మకం, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) పూర్తి నిషేధం విధించింది. దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి గాను ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో బాణాసంచా వినియోగానికి అనుమతిస్తే.. పరిస్థితి మరింత దిగజారిపోతుందనే ఉద్దేశంతో ట్రిబ్యూనల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఉత్తర్వు నేషనల్ క్యాపిటర్ రీజియన్(ఎన్సీఆర్)లో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 2 డజనుకు పైగా జిల్లాలకు వర్తిస్తుంది.
అంతేకాక దేశవ్యాప్తంగా "గత ఏడాది నవంబర్లో సగటు పరిసర గాలి నాణ్యత" అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది.అలానే గాలి నాణ్యత మోడరేట్గా ఉన్న నగరాలు, పట్టణాల్లో తక్కువ కాలుష్య కారకాలుగా పరిగణించబడే గ్రీన్ క్రాకర్స్ని మాత్రమే అనుమతించింది. అది కూడా పరిమిత సమయం వరకు మాత్రమే. "సంబంధిత రాష్ట్రం పేర్కొన్న విధంగా పర్వదినాల్లో బాణాసంచా కాల్చే సమయం రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయబడింది.
దీపావళి, గురుపూర్లలో రాత్రి 8-10 గంటల మధ్యన, ఛత్లో ఉదయం 6-8 గంటల మధ్య.. క్రిస్మస్, న్యూ ఇయర్ రోజున రాత్రి 11.55 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతించబడినట్లు" ఉత్తర్వుల్లో పేర్కొన్నది