సచివాలయ కూల్చివేత జోలికి వెళ్లలేము ..నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
By: Sankar Mon, 20 July 2020 3:01 PM
తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు వచ్చింది ... పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయం కూల్చివేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఎన్జీటీ సోమవారం విచారించింది. ఈ పిటిషన్ను విచారించిన ఎన్జీటీ.. సచివాలయం కూల్చివేత అంశం జోలికి వెళ్లబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందుకు కూల్చివేత జోలికి వెళ్లలేమని ఎన్జీటీ తేల్చిచెప్పింది.
ఈ విషయమై ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులిచ్చింది. కూల్చివేతతో పర్యావరణ కాలుష్యం, వ్యర్థాల నిర్వహణపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, సీపీసీబీ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.
సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు నుంచి అనుమతి లభించిన విషయం విదితమే. భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ ను ఈ నెల 17వ తేదీన కోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ శాఖ అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.