బయపడనవసరం లేదు ..ఆ ప్రాంతంలో భూకంపాలు సహజమే
By: Sankar Sun, 04 Oct 2020 9:21 PM
బోరబండ ప్రాంతంలో వస్తున్న భూకంపాలు సహజమైనవేనని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ నగేష్ పేర్కొన్నారు. ఈ భూకంపాలు వల్ల పెద్దగా ప్రమాదాలు జరగవన్న ఆయన ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు అయితే అసలే లేవని అన్నారు. రిక్టర్ స్కేల్ పై 1.4 నమోదయిందని, భూమి పొరల్లో నీరు చేరుతున్న సమయంలో ఇలాంటి శబ్దాలు వస్తుంటాయని అన్నారు.
పై పొరల్లో నీరు చేరుతున్న సమయంలో ఈ శబ్దాలు వస్తాయని, లోతుల్లో జరిగితే శబ్దాలు వచ్చేవి కావని అన్నారు. సూర్యపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరులో గత తొమ్మిది నెలల నుండి 1600 సార్లు భూకంపం వచ్చినట్టు పేర్కొన్న అయన ఇవాళ ఒక్కరోజే 12 సార్లు అక్కడ భూకంపం వచ్చినట్టు రికార్డ్ అయిందని అన్నారు. బోరబండ లో మూడు ప్రాంతాల్లో అబ్జర్వేషన్ చేస్తున్నామని, గతంలో వచ్చిన స్థలంలోనే మళ్లీ రిపీట్ అయ్యాయా, కొత్త ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయా అనే కోణంలో పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు.
ప్రజలు భయపడాల్సినంత తీవ్రత ఈ ప్రకంపనలకు లేదని అన్నారు. సోషల్ మీడియా లో వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. దక్షిణ భారత దేశంలో భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువని, అధిక వర్షాలు, వర్షపాతం నమోదు కావడం వల్లే ప్రకంపనలు వస్తున్నాయని అన్నారు.