Advertisement

నివర్ సైక్లోన్... సీఎం జగన్ కీలక ఆదేశాలు...

By: chandrasekar Tue, 24 Nov 2020 6:29 PM

నివర్ సైక్లోన్... సీఎం జగన్ కీలక ఆదేశాలు...


బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘నివర్ సైక్లోన్‌’ తుపాను ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నివర్‌ తుఫానుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నివర్ తుఫాను నేరుగా ఆంధ్రప్రదేశ్‌ను తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తుఫాను ప్రభావం బుధవారం నుంచి గురువారం వరకు ఉంటుందని, సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా తాయారుకావాలని అధికారులను ఆదేశించారు. ‘‘నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలపై 11- 20 సెంటీ మీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది. 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలి. కోతకోసిన పంటలను రక్షించేందుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి. ఒకవేళ ఇంకా పొలంలోనే పంటలు ఉంటే వాటిని కోయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అక్టోబర్ వరకు పడిన వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్న నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలు పడితే చెరువులు గండ్లు పడే అవకాశాలు ఉంటాయి. ఈ గండ్లు పడకుండా నిరంతరం మానిటరింగ్‌ చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోండి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దశ, దిశ చూపండి. వీరి సేవలను పెద్ద స్థాయిలో వినియోగించుకోండి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంచేసుకోండి. అలాగే కరెంటు సరఫరాకు ఇబ్బందులు వచ్చిన సమక్షంలో వెంటనే పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధం చేసుకోండి. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసుకోండి. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌రూమ్స్‌ఉండాలి’’ అని అధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Tags :
|
|

Advertisement