ఓ అభాగ్యుడికి పోలీసులు చేసిన సపర్యలకు నెటిజన్ల నీరాజనాలు
By: chandrasekar Fri, 17 July 2020 4:55 PM
వర్షంలో తడిసిన ఓ
అభాగ్యుడికి మన భాగ్యనగర పోలీసులు చేసిన సపర్యలు చూడటానికి చిన్న పిల్లాడికి
చేసినట్లు అతడికి సేవ చేశారు. నెటిజన్ల నీరాజనాలు అందుకుంటున్నారు. బాధితుడు గత
మూడు రోజులుగా వర్షంలో తడుస్తూ ఓ దుకాణం ముందు పడుకున్నాడని స్థానికులు చెప్పారు.
హైదరాబాద్లోని
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తలదాచుకోవడానికి గూడు లేక
వర్షంలో తడిసిపోతున్న ఓ వ్యక్తిని గమనించిన కానిస్టేబుళ్లు బి రమేశ్, ఎండీ
సయ్యద్ పరుగు పరుగున అతడి వద్దకు చేరుకున్నారు.
వర్షానికి తడవకుండా
అతడిని ఓ హోటల్ వద్దకు తీసుకొచ్చి టీషర్ట్తో ఒళ్లు తుడిచారు. ఆ తర్వాత అతడికి
షర్ట్ వేశారు. కానిస్టేబుళ్ల సపర్యలు గమనించి అక్కడే ఉన్న స్థానికులు కూడా చేయూత
అందించారు. శానిటైజర్ను తీసుకొచ్చి పోలీసులకు అందించాడు ఓ వ్యక్తి. జీహెచ్ఎంసీలో
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ చేతులు శానిటైజ్ చేసుకున్న
కానిస్టేబుళ్లు ఆ వ్యక్తికి కూడా శానిటైజ్ చేశారు.
ఆ తర్వాత అతడికి ఛాయ్
తాగిపించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతడి వివరాల గురించి ఆరా
తీయగా తన పేరు శేఖర్ అని మాత్రమే చెప్పగలిగినట్లు తెలిపారు. నిర్భాగ్యుడి పట్ల
మానవత్వం ప్రదర్శించిన కానిస్టేబుళ్లిద్దరినీ ప్రశంసించారు హోం మంత్రి మహమూద్ అలీ.